Saturday, July 23, 2011

నిన్న రాత్రి మా ఇంట్లో మూడు బ్రహ్మకమలాలు పూసాయి.

నిన్న రాత్రి మా ఇంట్లో మూడు బ్రహ్మకమలాలు పూసాయి.



వాటిని వీడియో తీస్తూ నా ఫోటోలు సరదాగా పెట్టాను.

Friday, July 22, 2011

అనంతగిరి కొండల్లోకి అలా అలా.......





అనంతగిరి అంటే వైజాగ్ జిల్లా అరకు దగ్గరి అనంత గిరి అనుకుంటే మీరు మూసిలో కాలేసినట్టే.
నేను రాస్తున్నది రంగారెడ్డి జిల్లా,వికారాబాద్ దగ్గరున్న అంతగిరి గురించి.
హైదరాబాద్ కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుతమైన ప్రదేశం.
నిన్న అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని అనంత గిరికి ఎగిరిపోయాం నేను నా నేస్తాలు గీత,జయ.
జయ నిన్ననే వైజాగ్ నుండి వచ్చింది.
ఎటైనా పోదామా ముగ్గురం అనుకుని ఓ పెద్ద కారియర్ కట్టుకుని 10 గంటలకి బయలుదేరాం.నేనే డ్రైవింగ్.
మబ్బులు పట్టిన ఆకాశం మాతోనే ప్రయాణం చేసింది.
చల్లటి గాలి మమ్మల్ని వదిలితే ఒట్టు.
హైదరాబాద్ కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుమైన ప్రదేశం.
వికారాబాద్ రోడ్ లో ఓ ప్రత్యేకత ఉంది.రోడ్డుపొడవునా ఊడలు దిగిన మర్రి చెట్ట్లు మనకి పచ్చటి స్వాగత తోరణాలు కట్టి ఆహ్వానిస్తున్నట్టుంటాయ్.
ఈ రోడ్డు నాలుగు లేన్లో ఆరు లేన్లో అవ్వకూడదని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను.
రోడ్డు వెడల్పు ప్రోగ్రాం పెడితే ఈ మర్రి ఊడల సౌందర్యమంతా హుష్ కాకే.
సరే! మేము ఈ పచ్చటి రోడ్డుమీద గతుకులు గట్రా ఉన్నప్పటికి రయ్మంటూ దూసుకెళ్ళసాగాం.
నేను చాలా ఫాస్ట్ అండ్ రాష్ డ్రైవర్ ని లెండి.
చేవెళ్ళ చెల్లెమ్మ సబిత నియోజకవర్గం కదా రోడ్డు అద్దం లా ఉంటుందనుకున్న మా భ్రమలు ఆ గతుకుల రోడ్డు మీద భళ్ళున పగిలాయ్.
మేము 12 గంటలకి అనంతగిరి చేరాం.అక్కడొ అనంత పద్మనాభుడి గుడి కూడా ఉందండోయ్.
టిబి సానిటోరియం కూడా ఉంది.ఒకప్పుడు టిబి వస్తే ఇంట్లో ఉండనిచ్చేవారు కాదు కాబట్టి సానిటొరియం లుండేవి.అనంతగిరి లోని ఈ సానిటోరియం కూడా ఒకప్పుడు రోగులతో కిటకిట లాడేదట.ఇప్పుడలాంటి సీనుల్లేవు.
నాకు గుళ్ళతో పని లేదు కానీ నా ఫ్రెండ్స్ కోసం గుళ్ళో కెళ్ళాను.చాలా శుభ్రంగా చల్లగా ఉంది లోపల.
ఓ ఐదు నిమిషాల్లో గుడిపక్కనున్న మెట్ల మీదుగా అడివిలోకి అడుగులేసాం.
కాలేజి పిల్లలు చాలా మందే కనబడ్డారు.
నడుస్తూ,నడుస్తూ చిక్కటి అడవిలోకి వచ్చేసాం.
అడవి ఎంత అందంగా ఉందో చెప్పలేను.ఈ అడవిలోనే క్షణ క్షణం సినిమా తీసారట.
ఈ అడవికి కొంచం అవతల కొండల్లోనే మన మూసి పుట్టింది.
తలకోన అడవిలో ఉండేలాంటి పెద్ద పెద్ద తమ్మకాయల తీగలు ఒక చెట్టు మీంచి ఇంకో చెట్టుమీదకి ఎగబాకి ఎంత దట్టంగా అల్లుకుపోయాయో.లావు లావు తీగలు ఉయ్యాలల్లాగా అల్లుకున్నాయి.
మేము ఓ చెట్టు కింద కూర్చుని తెచ్చుకున్న కారియర్ పని పట్టాం.
మేము తింటున్నప్పుడు ఓ శునకం గారు వస్తే వారికీ భోజనం పెట్టాం.ఇంక వారు తోక ఊపుకుంటూ మాకు కాపలా కాస్తూ అడివంతా మాతో తిరిగారు.
మేము అచ్చం ముసాఫిర్ల్ లాగా తిన్న చోట బిచాణా ఎత్తేసి ఇంకో పెద్ద చెట్టు కింద పడకలేసేసాం.
ఆ అడవి మధ్యలో ఆ పెద్ద చెట్టు కింద వెల్లికిలా పడుకుని,చెట్ల ఆకుల్లోంచి కనిపిస్తున్న ఆకాశాన్ని చూడాల్సిందే.
అలా చూస్తూ ఉన్నామా హటాత్తుగా మబ్బులు కమ్మి జలజలా
వానపడసాగింది.ఈ దృశ్యాన్ని ఎలా వర్ణించాలో నిగంగా నాకు మాటలు దొరకడం లేదు.
మా మీద ప్రకృతి కెంత ప్రేమ ఇలా ముత్యాల జల్లు కురిపించిందని తెగ మురిసిపోయాం.
ఆ దృశ్యం ఎక్కువ సేపు లేదు కూడా.అయినా మా మనసుల్లో నిండిపోయింది.
ఆ మత్తులోంచి తేరుకుని ఆ అడవిని వదలలేక వదలలేక మళ్ళి జనారణ్యలోకి వెలుతురుండగానే వచ్చిపడాలి కాబట్టి తిరుగు ప్రయాణమయ్యాం.
నిన్న నేను 160 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఈ అద్భుతానందాన్ని నా నేస్తాలతో సహ అనుభవించాను.
ఆ సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలని ఇదంతా రాసాను.



Monday, July 18, 2011

జైళ్ళతో నా అనుభవాలు-రెండో భాగం

నేను 2008 లో 40 మంది రచయిత్రులను తీసుకుని ఉత్తరాంధ్ర టిప్ వేసాను.

అప్పుడే పోలీసుల అత్యాచారాలకు గురైన ఆదివాసీ స్త్రీలను కలవడానికి వాకపల్లి వెళ్ళాం.
గంగవరం పోర్ట్ బాధిత గ్రామాలు గంగవరం,దిబ్బపాలెం వెళ్ళి అక్కడి బాధితులను కలిసాం.బాక్సైట్ తవ్వకాలను వీరోచితంగా ఎదిరించిన కాకి దేవుడమ్మను,పాడేరులో కలిసి మాట్లాడాం.
ఆ తర్వాత విశాఖ సెంట్రల్ విజిట్ చేసాం. విశాఖ జైల్ పరిసరాలు చాలా సుందరంగా ఉంటాయిచుట్టూ సిమ్హాచలం కొండల పంక్తి,ఎత్తైన కొండలు,కళ్ళు తిప్పుకోనీయని పచ్చదనంతో కన్నుల పండగ చేస్తుంది.బయట నుండి వెళ్ళిన వారు ఆ సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తాం కానీ ఖైదీలకు ఆ అనందం దొరకదు కదా!!వాళ్ళ కళ్ళల్లో దిగులే ఉంటుంది.
మహిళా జైల్ చూసి ఖైదీలతో మాట్లాడాం.వాళ్ళు వినిపించిన బాధల గాధలు విని రచయిత్రులంతా కన్నీళ్ళు పెట్టుకున్నారు.ఎంతో మంది బయట వదిలేసి వచ్చిన పిల్లల గురించి,తమ బెయిళ్ళ గురించి,తమ కేసుల గురించి చెప్పకున్నారు.
జైలర్ నరశిం హం గారు ఆ రోజు మాకు ఎంతో సహకరించారు.వాళ్ళ ఇంటికి పిలిచి అంతమంది రచయిత్రులను చూసి ఆయన భార్య, తల్లి చాలా సంతోషపడ్డారు.
జీవితంలో మొదటి సారి జైలు కూడు తిన్నాం.జైలు కూడులా లేదనుకోండి.మా కోసం ప్రత్యేకంగా చేయించారు అని తెలిసిపోయింది.
మా కోసం నావి వారి సంగీత ప్రోగ్రాం ఏర్పాటు చేసారు.
మొత్తానికి తెలుగు దేశం లో ప్రసిద్ధులెన నలభై మంది రచయిత్రులతో కలిసి చేసిన ఆ సాహితీ యాత్ర అనుభవాలు అద్భుతం.
ముఖ్యంగా విశాఖ జైలు సందర్శనం.



Saturday, July 16, 2011

ఒంటరి ప్రయాణాల్లో వెల్లువెత్తిన ఆదరణ


ఇంఫాల్లో సమావేశమైన మహిళా జర్నలిస్టులు



చాలా మంది ఒంటరిగా కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి భయపడుతుంటారు.
కొత్త ప్రాంతం,కొత్తమనుషులు,ఎవరైనా మోసం చేస్తారనే భయం వెంటాడుతూంటాయి.
కానీ నేను ఎన్నో ప్రాంతాలకి ఒంటరిగా ప్రయాణం చేసాను. చేస్తూంటాను.
నాకు ఎప్పుడూ భయమనిపించలేదు.
ఎంతో కల్లోలిత ప్రాంతమైన మణిపూర్ కి కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళాను.
అక్కడికెళ్ళాకా చాలామంది మన రాష్ర్ట్రం వాళ్ళు కలిసారు.
అలాగే భువనేశ్వర్,లక్నో కలకత్తా, కొచ్చిన్.గౌహతి ఇలా ఎన్నో ప్రంతాలు తిరిగాను ఒంటరిగానే.
నిజానికి మనం భయపడినట్టు ఉండదు.
నోట్లో నాలుక ఉండి,నాలుగు ఇంగ్లీషు,హిందీ ముక్కలు వస్తే దేశం మొత్తం చుట్టేసి రావొచ్చు హాయిగా.
నేను 2008 లో మణిపూర్ వెళ్ళాను.జాతీయ స్థాయి మహిళా జరనలిష్టుల సమావేశాల్లో పాల్గోడానికి వెళ్ళాను.ఇంఫాల్ లో నాలుగు రోజులున్నాను.
దానికి సంబంధించిన ట్రావెలోగ్ "ఇంఫాల్ ఎక్ పల్ హసి ఎక్ పల్ ఆశు"పేరుతో ట్రావెలోగ్ రాసాను.
అయితే మణిపూర్ నుంచి షిళ్ళాంగ్ వెళ్ళాం. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్‌ యజవని హరీష్‌ని గురించి తప్పక రాయలి.అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా వున్నానని, కళ్ళు, ముక్కుతీరు తన చెల్లెల్ని గుర్తుకు తెస్తోందని చెబుతూ మా గురించి వివరాలు అడిగి, హెల్ప్‌లైన్‌ గురించి విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎవరూ అలా పని చెయ్యరని, తనకి లా ఫామ్‌ పెట్టాలని వుందని మీరు హెల్ప్‌ చేస్తరా అని అడిగాడు. మాకు గౌహతిలో చౌకగా మూడు నక్షత్రాల హోటల్‌లోరూమ్‌లు మాట్లాడి పెట్టాడు. హైదరాబాద్‌ వచ్చాక రెండు సార్లుమాట్లాడాడు. 'బెహాన్‌! ఆప్‌ ఫిర్‌ కబ్‌ ఆరే షిల్లాంగ్‌' అంటూ ఆప్యాయంగా మాట్లాడే హరీష్‌,
గౌహతిలో నన్ను తన ఆటోలో కూర్చోబెట్టుకుని,కామాఖ్య కొన్డ మీదకి,బ్రహ్మపుత్ర నది మీదకి పడవ శికారుకి తీసుకెళ్ళి,నగరమన్తా తిప్పి చూపిన్చి భద్రమ్గా నన్ను ఎయిర్ పోర్ట్ లో దిన్చిన ఆటో వాలా కమల్ భాయ్,
ఇప్పుడు నేను కమల్ భాయ్ గురించి కొంత రాయాలి.
నాతో ఉన్న వాళ్ళు కాజీ రంగా నేషనల్ పార్క్ చూడ్డానికి వెళ్ళి పోయారు.
నేను ఒక్కదాన్ని గౌహతిలో ఉండిపోయాను. ఆరోజు సాయంత్రం నా ఫ్లైట్ ఉంది.
ఆరోజు గౌగతి అంతా చూద్దమనిపించింది.
హోటల్ రూం ఖాళీ చేసేసి సూట్కేస్ తో సహా రోడ్డున పడ్డాను.
ఆటో మాట్లాడుకుని ఆ రోజంతా దానిలోనే తిరిగాను.కమల్ నాతోనే తిన్నాడు.నాతోనే తిరిగాడు.నేను షాపింగ్ కి వెళితే నా సామాను జాగ్రత్తగా చూసాడు.సామాను తీసుకుని పారిపోతాడేమో అనే ఆలోచన కూడా నాకు రాలేదు.
ఒకవేళ తెసుకెళ్ళినా చేసేదేమీ లేదు పోతే ఏంపోతాయిలే.కొన్ని బట్టలు,పుస్తకాలేగా అనుకున్నాను.
ఎంత జాగ్రత్తగా ఆరోజు నన్ను చూసుకున్నాడో చెప్పలేను.
నాకెప్పుడూ కమల్ గుర్తొస్తూంటాడు.
ఆ రోజంతా అతన్ని కమల్ భాయ్ అనే పిలిచాను.
నాకు నా ఒంటరి ప్రయాణాల్లో ఇలాంటి వాళ్ళు ఎందరో కలిసారు.
వాళ్ళని తలుచుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది.

Monday, July 11, 2011

రెండు దశాబ్దాల ప్రయాణం

                                                                                               జనవరి 2012కి భూమికకు ఇరవై ఏళ్ళు నిండుతాయి. నా జీవితంలో రెండు దశాబ్దాలు భూమికతోనే పెనవేసుకుపోయాయి. నా ఇంటిపేరు భూమికయ్యింది. భూమిక నాశ్వాసలో భాగమయ్యింది. ఉదయం లేచిందగ్గర నుండి నా తొలి ఆలోచన భూమిక. నిద్రపోయేముందు కలవరపరిచేది భూమిక (హెల్ప్‌లైన్‌ కేసులు) ఇంతగా నాతో కలగలిసిపోయిన భూమిక మూతబడితే…
ఈ ఊహ కూడా నన్ను భయపెడుతుంది. భూమిక పత్రికలోంచి హెల్ప్‌లైన్‌లోకి మొదలైన ప్రయాణం, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు భూమికను బలోపేతంచేసిన తీరు నేను తప్పక మననం చేసుకోవాలి. హెల్ప్‌లైన్‌ లేకపోతే పత్రిక మూతపడేదన్నది కఠోరవాస్తవం. ఐదారు సంవత్సరాల క్రితం భూమిక ఆర్థిక పరిస్థితి ఎలా వుందో ఇపుడూ అలాగే వుంది. హెల్ప్‌లైన్‌కి ఆక్స్‌ఫామ్‌ ఆర్థిక సహకారం దొరకడంతో భూమిక బతికిపోయింది. ఇలా ఎక్కువ కాలం జరిగే అవకాశం లేదు.
నిజానికి ఈ రోజు ఒక సంస్థగా భూమిక ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. గృహహింసచట్టం అమలుకోసం ఎన్నో డిపార్ట్‌మెంటులతో కలిసి పనిచేస్తోంది. ఉచిత న్యాయం బాధితులకు అందేలా లీగల్‌ సర్వీసెస్‌ ఆథారిటీతోను, రక్షణాధికారుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి మహిళా,శిశు అభివృద్ధి శాఖతోను నిరంతరం కలిసి పనిచేస్తోంది. ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించని జ్యుడిషియరీలోకి, పోలీస్‌శాఖలోకి వెళ్ళగలిగాం. మేజిస్ట్రేట్‌లకి, పోలీసులకి జండర్‌ స్పృహ మీద శిక్షణ నిస్తున్నాం. జండర్‌ స్పృహ అనే పాఠం వారి పాఠ్యాంశాల్లో (కరికులమ్‌)లో భాగం చేయించగలిగాం.
ఈ రోజు మేము పత్రికా నిర్వహణ దాటి ఎన్నో కార్యకలాపాల్లోకి విస్తరించాం. భిన్నమైన పనుల్లోకి వెళ్ళ గలిగాం. స్త్రీలఅంశాలమీద-అవి ఆసిడ్‌ దాడులవ్వొచ్చు, పనిచేసేచోట లైంగిక వేధింపులవ్వొచ్చు. 498ఏ మీద కావొచ్చు, గృహహింస చట్టం అమలు గురించి కావొచ్చు, ఈ అంశాల మీద ప్రధమంగా స్పందించే సంస్థగా మేము ముందుకొచ్చాం. స్త్రీల అంశాల మీద రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించాం. జాతీయస్థాయిలో మా గొంతు వినిపించాం.ఈ పనులన్నీ చేయడం వెనుకవున్న లక్ష్యం ఒక్కటే. బాధిత మహిళలకి అండగా నిలబడడం. ప్రభుత్వ,ప్రభుత్వేతర సంస్థలు నడుపుతున్న సహాయ, సపోర్ట్‌ సంస్థలను బాధితులకు అందుబాటులోకి తేవడం.
స్త్రీల అంశాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యడం భూమిక పత్రికద్వారా చేస్తున్నాం. దీనికోసమే నవంబర్‌-డిశంబర్‌సంచికని స్త్రీలు-చట్టాలు-సపోర్ట్‌ సిస్టమ్స్‌ పేరుతో మహిళా శిశు అభివృద్ధిశాఖ సహకారంతో ప్రత్యేకసంచికగా వెలువరించాం. పదివేల కాపీలు ప్రింట్‌ చేసి జిల్లా కలక్టర్‌ మొదలుకొని, అట్టడుగున పనిచేసే అంగన్‌వాడి వర్కర్‌ వరకు ఈ ప్రత్యేక సంచికను పంపించాం. బాధిత మహిళలు సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్ళినపుడు వారికి కావలసిన సహాయాన్ని అందించడంలో ఈ ప్రత్యేక సంచిక ఎంతో ఉపయోగపడుతుంది.
ఇరవై  ఏళ్ళుగా భూమికను ఎక్కడా రాజీ పడకుండా నడపగలగడం నా జీవితంలో నేను నిర్వహించిన ఒక సామాజిక బాధ్యత. ఈ బాధ్యతని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎన్నో ఒడిదుడుకుల్ని, వ్యక్తిగతంగా ఎంతో సంఘర్షణని అనుభవించాను. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆర్ధికంగా భూమిక పరిస్థితి అలాగే వుండడం నన్ను చాలా ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరికి ఎవరూ కానీ ఈనాటి సామాజిక నేపధ్యం, ఒక చిన్న పత్రిక ఆగిపోతే ఏమౌతుందిలే అనే నిర్లిప్తత నా కలవరానికి దోహదం చేస్తున్నాయి. ఆర్ధిక సమస్య ఒక వేపు, భూమిక స్థాయిని చేరుకునే రచనలు అందకపోవడం మరో కారణం. ఎప్పటికప్పుడు వేట. రచనల కోసం వేట. ప్రతి నెలా పదో తారీఖునాటికి నలభై నాలుగు పేజీలు నింపాల్సిన ఒత్తిడి. ఏదో ఒకటిలే పేజీలు నింపుదామంటే కొండంత చెత్త దొరుకుతుంది. అదంతా నింపితే అపుడు అది భూమిక అవ్వదు కదా!ఎనభైలలో ఉప్పెనలాగా విరుచుకుపడిన రచయిత్రులు ఎందుకనో రాయడం తగ్గించేసారు. కవయిత్రులైతే అడపా దడపా తప్ప రాయడమే లేదు. నిజానికి నలువేపులా విధ్వంసం చుట్టుముడుతున్న వేళ రాయడం ఒక బాధ్యత. ఎంతో విస్తృతమైన వస్తువు మనముందుంది. భూమిపోరాటాలు, పెచ్చుమీరిపోతున్న హింస, కనుమరుగవుతున్న ఆడపిల్లలు, ‘అభివృద్ధి’విధ్వసం, కూలుతున్న మానవసంబంధాలు, సరిహద్దులు చెరిగిపోతున్న సెక్స్‌వృత్తి..ఇలా ఎన్నో ఎన్నో అంశాలు మనముందున్నాయి. వీటన్నింటి మీదా విశ్లేషణాత్మక రచనలు రావాల్సిన అవసరం వుంది. సీరియస్‌గా రాసే రచయితల కలం కునుకు తీస్తే…
ఇరవై ఏళ్ళు నిండిన సందర్భంగా వచ్చే మార్చి 2012 సంచికని ప్రత్యేక సంచికగా ప్లాన్‌చేద్దామని ప్రసన్న (నాతో పాటు ఇరవై ఏళ్ళుగా భూమికలో పనిచేస్తున్నది) అన్నప్పుడు నా మనస్సులో మెదిలిన ఆలోచనలివి. భూమిక భవిష్యత్తు గురించి నా ఆందోళన ఇది. భూమిక మనందరిదీ… మీ ఆందోళన మాది కూడా.. భూమికను నిలుపుకోవడం అందరి బాధ్యత అని ఎవరైనా మనస్ఫూర్తిగా అంటారని, అలా అనేవాళ్ళు చాలామందే వున్నారని బలంగా నమ్ముతూ… ఆశావహంగానే…

Friday, July 8, 2011

ప్రాణమైన గోదావరిమీద ప్రాణ నేస్తంతో షికారు


మా గోదావరంటే నాకు ప్రాణ సమానం.
ప్రాణమైన గోదావరిమీద ప్రాణ నేస్తంతో షికారుకెళితే
కనుచూపుమేరంతా కనువిందు చేసే పచ్చదనం
కోనసీమ కొబ్బరితోటల సౌందర్యం
అల్లంత దూరాన అగుపడే అన్నా చెల్లెలి గట్టు
పోటుమీదున్న సముద్రపు అలలు మా లాంచిని ఉయ్యాలలూగిస్తుంటే
నేను గీత ఎన్ని కబుర్లను కలబోసుకున్నామో1
గోదావరిలోంచి మా ప్రయాణం అంతర్వేది దాకా
అటుపైన అన్నా చెల్లెలి గట్టుదాకా
అన్నంటే సముద్రం చెల్లంటే గోదావరి
రెండు కలిసేచోటునే అన్న చెల్లెల గట్టు అని ఆప్యాయంగా పిలుస్తారు
సముద్రాన్ని పురుషుడితోను,నదుల్ని స్త్రీలతోను ఎందుకు పోలుస్తారో!
నిజానికి వరద గోదావరి మహా బీభత్సంగా ఉంటుంది.
వెన్నెల్లో గోదారి ఎంత ఉద్విగ్నం గా,పరవశం గా ఉంటుందో
వరద గోదారి అంత భయానకంగా ఉంటుంది
మా ప్రయాణం నవ్వుల నదిలో పువ్వుల నావ లా సాగుతూనే ఉంది
మా కబుర్లకు అంతూ పొంతూ లేదు అన్నం నీళ్ళ ధ్యాసే లేదు
గలగల పారుతున్న గోదారిలో మా కబుర్లు కలగలిసిపోతున్నాయ్
కొండ గాలి తిరిగింది గుండె ఊసులాడింది పాట సెల్లోంచి
గోదావరిని చూస్తే గుండె ఊసులాడకుండా ఉంటుందా
అదీ ప్రియనేస్తం పక్కనుంటే ఊసులకేమి కొదువ?
మేమిద్దరం కలిస్టే కబుర్లకేమి లోటు?
అందమైన ఆనాటి ప్రయాణానికి మా ముఖాల్లోలి వెలుగు
అద్దం పడుతోని కదా???



Wednesday, July 6, 2011

జైళ్ళతో నా అనుభవాలు-మొదటి భాగం

నేను మొదటిసారి 1999 లో రాజమండ్రి సెంట్రల్ జైల్ విజిట్ చేసాను.
అప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం లో మండల రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
ఆ ఉద్యోగానికి రిజైన్ చేసాలెండి.
చిలకలూరిపేట బస్సు దహనం కేసు మీకు గుర్తు ఉండే ఉంటుంది.
1993 మార్చి 8 న చలపతి,విజయవర్ధనం అనే ఇద్దరు దళిత యువకులు చిలకలూరి పేట నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో దోపిడీ చెయ్యడానికి ప్రయత్నించి పెట్రోల్ పొయ్యడం వల్ల బస్సు తగలబడి చాలామంది సజీవ దహనమయ్యారు.అదో భయానక సంఘటన.అప్పట్లో ఎంతో సంచలనం కల్గించిన ఘోరమైన నేరం.
ఈ కేసులో ముద్దాయిలైన చలపతి,విజయవర్ధనం లకు కోర్టు మరణ శిక్ష విధించింది.
వాళ్ళు చేసింది ఘోరమే.కాని మరణ శిక్ష పరిష్కారం కాదు.
అప్పట్లో మరణ శిక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక గ్రూప్ లో నా మితృరాలు ఉండడం,వాళ్ళు మరణశిక్షలకు వ్యతిరేకంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తుండడం వల్ల నేను కూడా వాళ్ళతో కలిసి మరణ శిక్షలు పడ్డ చలపతి,విజయవర్ధనం లను కలిసి వాళ్ళ ఇంటర్యూలను తీసుకోవడానికి రాజమండ్రి సెంట్రల్
జైలుకెళ్ళేం.
వాళ్ళని ఇంటర్యూ చెయ్యడం,వాళ్ళ వర్షన్ ని వినడం, దాన్ని షూట్ చెయ్యడం మర్చిపోలేని అనుభవాలు.
గుంటూరు లో ఓ మురికివాడలో నివసించే వీళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు.
బస్సును దోపిడీ చెయ్యాలని ప్లాన్ వేసారు.చిలకలూరు నుండి బస్సులో బయలు దేరి మార్గమధ్యంలో దోపిడీ కి ప్రయత్నించారు.ప్రయాణికులు ప్రతిఘటించడంతో ఘర్షణ
జరిగిందని మంటలు ఎలా చెలరేగాయో తమకు తెలియదని వాళ్ళు చెప్పారు.దోపిడీ చెయ్యడమే తమ ఉద్దేశ్యమని బస్సు తగలబెట్టాలని తాము అనుకోలేదని తమవల్ల జరిగిన ప్రాణ నష్టానికి తామెంతో కుమిలిపోతున్నామని చెప్పుకున్నారు.
తాము తెలిసో తెలియకో చాలా కుటుంబాలకు తీరని వేదన కలిగించామని తమని క్షమించమని వేడుకుంటున్నామని చెప్పారు.
మేము వాళ్ళతో ఓ పూటంతా గడిపాం.అప్పటికే చాలా కాలంగా
వాళ్ళు జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తున్నారు.
మరణ శిక్షలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న కాలమది.
వీళ్ళకు కూడా మరణ శిక్షను కఠినమైన జీవిత ఖైదుగా గా మార్చాలని జరిగిన ఉద్యమంవల్ల
వాళ్ళ మరణ శిక్ష ఎన్నోసార్లు వాయిదాపడింది.మరణం అంచులదాకా వెళ్ళారు చాలా సార్లు.
మొత్తానికి వాళ్ళ మరణ శిక్ష రద్దయ్యింది.
బహుశా వాళ్ళు జీవిత కాల శిక్షలు కూడా పూర్తి అయ్యి విడుదలయ్యుంటారు.
చాలా కాలం వాళ్ళ దగ్గర నుండి మాకు ఉత్తరాలొస్తుండేవి.
పశ్చాత్తాపంతో దహించుకుపోతూ ఉత్తరాలు రాసేవాళ్ళు.
వాళ్ళు చేసింది చిన్న నేరమేమీ కాదు.
అలా మొదటి సారి నేను జైల్ చూసాను.

Saturday, July 2, 2011

ఈ సీజన్ కి మొదటి బ్రహ్మకమలం

విచ్చుకుంటున్న పువ్వు ఇది

ఈ సీజన్ కి మొదటి బ్రహ్మకమలం నేను ఈ పోష్ట్ రాస్తున్నపుడు విచ్చుకుంటోంది.
ఆ వాసనలు ఇక్కడివరకూ వ్యాపిస్తున్నాయ్.
పదుల్లో మొగ్గలు వచ్చాయి.


2003 లో మొదటి సారి మా ఇంట్లో పూసిన పువ్వు ఇది.


తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...